Header Ads

వావ్ : ఆధార్ ATMలు వస్తున్నాయ్!

నగదు రహిత లావాదేవీలవైపు దేశం శరవేగంగా ముందుకు కదులుతోంది. క్యాష్‌లెస్‌ లావాదేవీలను సులభంగా నిర్వహించుకునేందుకు వీలుగా గతంలో ప్రతిపాదించిన ఆధార్‌ ఆధారిత చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం. ప్రభుత్వ యూపీఐ యాప్‌ ‘భీమ్‌’లో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. త్వరలోనే దేశ మంతటా దుకాణాలు.. ఇతర యాప్‌ల్లో ఇది అందుబాటులోకి రానుంది. ఇప్పటికే 14 బ్యాంకులు ఆధార్ ఆధారిత చెల్లింపులకు సిద్ధమయ్యాయి. ఇతర బ్యాంకులు కూడా ఇదే బాట పడుతున్నాయి. ఈ ఆధార్‌ చెల్లింపు విధానం అమల్లోకి వస్తే.. ప్రజలు దుకాణాల్లో ఆధార్‌ నంబరు చెప్పి.. వేలి ముద్ర వేసి చెల్లింపులు చేయొచ్చు. దీనికి ఫోన్‌, ఇంటర్నెట్‌ అవసరం లేదని వెల్లడించారు ఎలక్ర్టానిక్స్‌, ఐటీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌. కొన్ని బ్యాంకులు ఆధార్‌ పే యాప్‌ను సొంతంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.


ఆధార్ ATMలు వస్తున్నాయ్
ఆధార్‌ పే విజయవంతం అయితే.. భవిష్యత్తులో దేశంలో డెబిట్‌ కార్డులు ఉండవని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. చాలా బ్యాంకులు ఆధార్‌ నంబరు, వేలి ముద్ర స్కానింగ్‌ సాయంతో పని చేసే ATM వైపు కసరత్తు చేస్తున్నాయి. ఆ దిశగా సాఫ్ట్ వేర్ కూడా డెవలప్ చేస్తున్నారు. డెబిట్ కార్డ్ ప్లేస్ లో ఆధార్ కార్డ్ ఉంటే సరిపోతుంది. కార్డు కూడా మెషీన్ లో పెట్టాల్సిన అవసరం లేదు. మెషీన్ లో ఆధార్ నంబర్ ఎంట్రీ చేసి.. ఫింగర్ ఫ్రింట్ వేస్తే చాలు.. డబ్బులు వచ్చేస్తాయి. ఈ విధానంతో సైబర్ నేరాలకు ఆస్కారం ఉండదంటున్నారు నిపుణులు. వేలి ముద్ర స్కానింగ్ కంపల్సరీ ఉండటంతో.. ఇతరులు కూడా డబ్బులు డ్రా చేసే అవకాశం ఉండదు. అక్రమాలకు కూడా చెక్ పెట్టినట్లు ఉంటుందని చెబుతున్నారు. ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే.. ఫోన్‌ చేసి ఖాతాలో డబ్బులు కాజేయడం వంటి నేరాలూ తగ్గుతాయని భావిస్తుంది కేంద్ర ప్రభుత్వం. వచ్చే ఏడాది కాలంలో ఆధార్ ATMలను ప్రయోగాత్మకంగా అయినా అమలు చేయాలని ఇప్పటికే కొన్ని బ్యాంకులు సన్నాహాలు చేస్తున్నారు.