హైటెన్షన్ : రిసార్ట్స్ లో కుప్పకూలిన శశికళ..4 ఏళ్ళ జైలు శిక్ష విధించిన సుప్రీం కోర్ట్!!
అక్రమ ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించటంతో షాక్ అయ్యింది చిన్నమ్మ శశికళ. రిసార్ట్స్ లో ఎమ్మెల్యేలతో ఉన్న చిన్నమ్మ.. తీర్పు తెలుసుకుని కుప్పకూలారు. సృహకోల్పోయారు. ప్రత్యేక గదిలో బోరున విలపించారు శశికళ. తీర్పు ఈ విధంగా వస్తుందని ఊహించని శశికళ వర్గం కూడా ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. చిన్నమ్మ వెంటనే లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయటంతో ఇప్పుడేం చేయాలనే హైరానాలో ఉన్నారు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు. కోర్టు ఆదేశాలతో రిసార్ట్స్ లోకి వెళ్లారు పోలీస్ ఉన్నతాధికారులు.
రిసార్ట్స్ లో కమాండోలు :
శశికళను దోషిగా తేల్చి.. నాలుగేళ్ల జైలు శిక్ష విధించటం.. వెంటనే లొంగిపోవాలని ఆదేశించటంతో ఆమె బస చేసిన గోల్డెన్ బే రిసార్ట్స్ లో హైటెన్షన్ నెలకొంది. రిసార్ట్స్ చుట్టూ కమాండోలు మోహరించారు.
తమిళనాడులో హైటెన్షన్
అక్రమాస్తులపై శశికళకు నాలుగేళ్లు జైలు శిక్ష పడటంతో తమిళనాడులో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఇన్చార్జ్ గవర్నర్ విద్యాసాగర్రావు అధికార యంత్రాంగాన్ని హెచ్చరించడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. చెన్నై నగరంలోని అన్ని ప్రాంతాల్లో పోలీసు పికెట్లను ఏర్పాటు చేశారు.
15వేల మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు చెన్నై నగరంలో. రాజ్భవన్, పోయెస్ గార్డెన్, పన్నీర్సెల్వం నివాసం, పార్టీ కార్యాలయాలు, గోల్డెన్ బే రిసార్ట్స్ దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సీఎం కుర్చీ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న శశికళ ఎమ్మెల్యేలతో పాటు గోల్డెన్ బే రిసార్ట్స్లోనే ఉన్నారు.